హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటా సొంతం చేసుకున్న చైనా బ్యాంక్

చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా చైనా తన పని తాను చేసుకుపోతున్నది. ప్రపంచం దృష్టి కరోనా కల్లోలంపై కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా భారత్‌లోని ప్రముఖ మార్ట్‌గేజ్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటా గుట్టుచప్పుడు కాకుండా సొంతం చేసుకున్నది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కొనుగోలు జరిగింది. మార్కెట్లు కుప్పకూలిన సమయంలో 25 శాతం ధర తగ్గిన దశలో 1.75 కోట్ల షేర్లు చైనా బ్యాంకు కొన్నది. చైనా అదివరకే 0.8 శాతం వాటాలు కలిగి ఉన్నదని, ఇటీవల మరిన్ని షేర్లు కొనుగోలు చేసిందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్-చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు. ఇప్పుడు 1 శాతం పరిమితి దాటినందున కొనుగోలును వెల్లడించాల్సి వచ్చింది.